కర్మ యోగి మల్లిఖార్జున రావు -2

స్ఫూర్తి ప్రధాత - 2

మొదటి భాగం తరువాయి 

గ్రంధాలయం

మల్లిఖార్జునరావు -2014
పుస్తకం హస్త భూషణం అనే నినాదంతో స్వాతంత్ర పోరాటాంలో భాగంగా గ్రామ గ్రామాన ఒక గ్రంధాలయం ఉండాలనే గ్రంధాలయోద్యమ కార్యక్రమం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మల్లిఖార్జున రావు. 
జ్ఞాన సముపార్జనకు గ్రంధాలయాలు ఇతోధికంగా దోహదపడతాయని, గ్రంధాలయం సరస్వతిదేవి ఆలయమని  నమ్మిన మల్లిఖార్జునరావు వీరన్నపాలెం లో " గోరంట్ల సత్తన్న మెమోరియల్ గ్రంధాలయం " పేరుతో   తన ఇంటిలో ఒక గ్రంధాలయాన్ని కొంతకాలం పాటు స్వయంగా నిర్వహించాడు. దీని నిర్వహణకు కావలిసిన ఆర్థిక సహాయం  సత్తన్న కుంట మాన్యం భూములనుండి లభించేది. ఆ ఆదాయంతో ఒక శాశ్విత భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆశించాడు. ఆ తరువాత గోరంట్ల సత్తన్న గారి వారసులు/ బంధువులు మన్యం భూములను పంచుకొని 1962 లో గ్రంథాలయాన్ని మూసివేశారు. మల్లిఖార్జునరావు ఆ తరువాత ఆ గ్రంధాలయం సంబంధించిన పుస్తకాలను గ్రామంలో ఉన్న నవ్యభారత పాఠశాల గ్రంథాలయానికి అందచేసారు. 
పుస్తకాలు అంటే మల్లిఖార్జున రావుకి వల్లమాలిన ప్రేమ. పర్చూరు శాఖా గ్రంధాలయంలో సభ్యత్వం తీసుకొని దానినుండి పుస్తకాలు తెచ్చుకొనేవాడు. గ్రామ గ్రంధాలయం మూసివేసిన తరువాత తన అభిరుచి మేరకు అనేక ఆధ్యాత్మక గ్రంధాలను సేకరించి ఒక గృహ గ్రంధాలయం ఏర్పరుచుకున్నారు. శ్రమపడి సమకూర్చుకున్న గ్రంథాలను చాలా భద్రంగా కాపాడేవారు. భారత,భాగవత రామాయణ, పురాణ, ఉపనిషత్తులు వంటి వాటితోపాటు,వివేకానంద, రమణ మహర్షి, అరవిందులు, మాతల  తత్వసార గ్రంధాలతో విలసిల్లే  ఈ పుస్తక బాండాగారం వారి చరమాకం వరకు తోడుగా ఉంది. వారికి ఆనాడు వాస్తుశాస్త్రం పై సేకరించిన గ్రంధాలు, దానిపై ఉన్న మక్కువ, అభిలాషే వారి రెండవ కుమారుడు శ్రీనివాస్ పరిశోధనలకు , రచనలకు బీజం వేసింది. 
మారిన నేటి పరిస్థితులలో పుస్తకపఠనం పడకవేసి ,అంతరజాలం అందలం ఎక్కింది. పుస్తక రహిత సమాచారం సామాన్యులకు చేరువయింది. గ్రంథాలయాల  ఆవశ్యకత అడుగంటింది. రాబోయే రోజులలో గ్రంధాలయాలు గతించిన చరిత్రకు ఆనవాళ్ళగా మిగులుతాయనుటలో అతిశయోక్తి కాదేమో! 

గ్రామాభివృద్ధి సంఘం

నల్ల రేగడి నేలపై పురుడు పోసుకున్న పోతుగడ్డ వీరన్నపాలెం. కృష్ణ కాలువ నీటితో తిండిగింజలు పండే మాగాణి భూములు తూర్పు దిక్కున ఉంటే సిరులు కురిపించే పొగాకు, ప్రత్తి, మిరప, సెనగ వంటి వాణిజ్య పంటలు పండే మెట్ట పొలాలు పడమర దిశలో ఉన్నాయి. రెండు రకాల పంటలు పండే భూములున్న అరుదైన ఊరు. ఆరుగాలం శ్రమించే రైతన్నలు. సిరి సంపదలు ఎన్నిఉంటే  నేమి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేని రోజులవి. ఆరు కిలోమీటర్లు దూరం లో ఉన్న పర్చూరు వెళితేకాని కనీస రవాణా సౌకర్యం అందుబాటులోకి రాదు. వర్షాకాలంలో పర్చూరు వాగు పొంగి రాకపోకలను సైన్ధవునిలా అడ్డుకొనేది. చినుకు పడితే చిన్నాచితకా ఏ పని కొరకైనా పట్నం వెళ్లాలంటే కాలినడకన మోకాళ్ళ లోతు బురదలో పర్చూరు వెళ్ళాలిసిందే. లేదా రెండు జతల ఎడ్లతో బండి కట్టాలసిందే. సమస్య అందరికి తెలుసు, కానీ పరిష్కారం ప్రభుత్వం నుండి ఆశించారు. ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురుచూడటం ఎందుకని, చేయి చేయి కలిస్తే కార్యం సిద్దిస్తుందనేది మల్లిఖార్జునరావు నైజం. గ్రామంలో ఉప్పు నిప్పులా ఉండే ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి "వీరన్నపాలెం గ్రామాభివృద్ధి సంఘం " పేరుతో  యార్లగడ్డ వీరయ్య ( తండ్రి చెంచయ్య ) అధ్యక్షతన తనతోపాటు 15 మందితో 1974లో రిజిస్టర్ సంఘం పెట్టించాడు. పండిన పంటకు ధాన్యం అయితే బస్తాకు 3 రూపాయలు, వాణిజ్య పంటలైతే క్వింటాల్ ఒకటికి 5 రూపాయలు వసూలు  చేసి  ఉప్పుటూరు మీదగా వెళ్లే పరుచూరు డొంకను మట్టి, కంకరతో కచ్చా రోడ్డును తొలిసారిగా నిర్మించారు. మల్లిఖార్జున రావు ఈ రోడ్డు నిర్మాణం జరిగిన సమయంలో అకుంఠిత దీక్షతో పనిచేశారు. వేసవిలో నీటి కొరతను నివారించటానికి చెరువులకు నీళ్లు పెట్టటం , ఊరిలో రోడ్లు వేయటం వంటి  గ్రామానికి పనికివచ్చేఅనేక కార్యక్రమాలు ఇదే సంఘం ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి చేశారు.  ఆ తరువాత పెత్తనంపై తగవులు, గ్రామ అభివృద్ధిపై అనాసక్తి వెరిసి సంఘాన్ని అటకెక్కించారు. 
శ్రీమతి లక్ష్మీదేవమ్మ,మల్లిఖార్జునరావు లతో కుమారుడు శ్రీనివాస్,కోడలు రాగిణి -2013

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం